హైదరాబాద్: క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (QCFI) హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు బేగంపేటలోని హోటల్ మారిగోల్డ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ సంస్థలకు చెందిన సుమారు 200 బృందాలు, 1,051 మంది ఉద్యోగులు పాల్గొని నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టులు, వినూత్న ఆలోచనలను ప్రదర్శించారు.
సదస్సును QCFI హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శ్రీ దయానంద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చ. బాలకృష్ణరావు, శ్రీ శ్యామ్ సుందర్, చైర్మన్ ఎమెరిటస్ శ్రీ కె. మనోహర్ హెగ్డే, డైరెక్టర్ మరియు గౌరవ కార్యదర్శి శ్రీ శంకరరావు సీతల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ దయానంద్ రెడ్డి మాట్లాడుతూ, “నాణ్యత అనేది కేవలం వ్యాపార అవసరం కాదు.. జాతీయ అవసరం” అని అన్నారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశ ప్రతిష్ఠను మరింత బలోపేతం చేయవచ్చన్నారు.
డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్తో పాటు సుస్థిరత, గ్రీన్ ప్రాక్టీసెస్ను క్వాలిటీ సర్కిల్ ఉద్యమంలో భాగం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాణ్యతను జీవన విధానంగా మార్చుకోవడం, ఉద్యోగులను ఆవిష్కరణలకు ప్రోత్సహించడం, ఆత్మనిర్భర్ మరియు వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
క్వాలిటీ సర్కిల్, 5S, కైజెన్ వంటి కార్యక్రమాల ద్వారా ఉద్యోగుల్లోని సృజనాత్మకతను వెలికితీయడమే QCFI ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంస్థలు తమ ఉత్తమ విధానాలు, ఆలోచనలను పరస్పరం పంచుకునేందుకు వార్షిక సదస్సు మంచి వేదికగా నిలుస్తుందన్నారు.
క్వాలిటీ సర్కిల్ ఉద్యమానికి విశేషంగా మద్దతు అందిస్తున్న NMDC, BHEL, థర్మో కేబుల్స్, థర్మో ప్యాడ్స్, టాటా, తోషిబా, BEL, M.S. అగర్వాల్, రామ్కో, KCP, విప్రో, బయోలాజికల్ E, HAL, రైన్ సిమెంట్స్ సంస్థలకు అవార్డులు అందజేశారు.
కార్యక్రమం ముగింపులో గౌరవ కార్యదర్శి శ్రీ శంకరరావు సీతల కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది.
