తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రబాద్ జంటనగరాలకు నడిబొడ్డున హుసేన్ సాగర్ కట్టకు అనుకొని కవకాల కట్టమైసమ్మ దేవాలయం విరాజిల్లుతోంది. హుసేన్ సాగర్ కట్టకు ఉన్నంత చరిత్ర ఆలయానికి ఉంది. హైదరాబాద్ సంస్థానాన్ని ఇబ్రహీం కులీకుతుబ్షా పరిపాలించిన కాలంలో తాగు, సాగునీరు అవసరాల కోసం చెరువును తవ్వించాలని తలపెట్టారు.
ఆయన అల్లుడు హజ్రత్ హుసేన్ షావలీకి పనులు అప్పగించారు. 5.7 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంతో చెరువును తవ్వించారు. రాళ్లతో బలమైన కట్టను కట్టించారు. నిర్మాణంలో చెమట చిందించిన కష్టజీవులు కొందరు కట్టకు శ్రీమైనమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేశారు హుసేన్ షావలీకి గుర్రం సవారీపైన అక్కడికి వచ్చి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.
దాంతో కార్మికులు సమాధానం ఇస్తూ చెరువుకు కట్టిన కట్ట తెగిపోకుండా ఉండాలని దిగువప్రజలు మునిగిపోకుండా కాపాడాలని కోరుతూ గ్రామ దేవత మైసమ్మను నిలుపుకొని పూజిస్తున్నామని వివరించారు. తాను కోరుకుంటున్నదే కష్ట జీవులు సైతం కోరుకుంటుండడంతో సంతోషించిన హజ్రత్ హుసేన్ వలీ తన జేబులో ఉన్న మొత్తం కనకపు కాసులు (బంగారు కాసులు) అమ్మవారికి సమర్పించి దండం పెట్టుకొని వెళ్లారు. నాటి నుంచి కట్టకు వెలిసిన మైసమ్మ వారిని కనకాల కట్టమైసమ్మ అని భక్తులు పిలుచుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో లోయర్ ట్యాంక్ బండ్ సుప్రసిద్ధ దేవాలయంగా పేరొందిన శ్రీ కనకాల కట్టమైసమ్మ ఆలయమునకు ఎంతో ఘన చరిత్ర ఉన్నది. ఈ దేవాలయమునకు ప్రతినిత్యము పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూంటారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా, భక్తులపాలిట కొంగుబంగారంగా ప్రాచుర్యం పొందిన శ్రీ కట్టమైసన్ను ఆలయానికి శివారుప్రాంత ప్రజలు సైతం బళ్ళు కట్టుకొని వచ్చి తమ మొక్కుబడులు తీర్చుకుంటూ వుంటారు.
నిజాం కాలంలో 1835-40లో ఈ ఆలయం ప్రాచుర్యంలోకి వచ్చినట్లుగా చెబుతారు. తెలంగాణా ప్రాంతంలో పొలాలు, సరస్సులు వున్నచోట తప్పనిసరిగా ఈ అమ్మవారి ఆలయం ఉండటం రివాజు. ఈ నేపథ్యంలో కట్టినదే ఈ ఆలయం, 1907వ సంవత్సరంలో నగరంలో వరదలు సంభవించినప్పుడు, వాటిని ఆపడానికి కట్టమైసమ్మ అమ్మవారికి ‘గలగపూజ’ చేయించారని ప్రతీతి. దానితో వరదలు ఆగిపోయాయని, ఇంతవరకు అలాంటి సంఘటనలు పునరావృతం కాకపోవడా నికి ఈ ఆలయం అమ్మవారి మహిమేనని భక్తుల నమ్మకం.
ప్రస్తుతం ఈ గంగ పూజ నగరంలో ఈ కట్టమైసమ్మ ఆలయం, గండిపేట దగ్గరున్న మైసమ్మ ఆలయంలో మాత్రమే జరుపుతారు. ఆషాడమాసంలో అమ్మవారికి ఆషాడ ఉత్సవాలు, దసరా నవరాత్రులలో నవరాత్రి ఉత్సవములు ఘనంగా జరుపుతారు.ఇక్కడ జరిగే బోనాల ఉత్సవాలకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పురాతన ఆలయాన్ని కీ॥శే॥ శ్రీ గోల్కొండ దానయ్య పటేల్ మరియు వారి కుటుంబ సభ్యులచే 1994లో పునఃనిర్మించారు. చిన్న గుడిని పెద్దగుడిగా మార్చారు. 450 సంవత్సరాల పూర్వము నుంచి ఉన్న కట్టమైసమ్మ స్థానమున కొత్త విగ్రహ ప్రతిష్టాపన జరిగింది.
శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య నృసింహభారతీస్వామి వారి చేతులు మీదుగా ఈ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఈ దేవాలయాన్ని 1996లో దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధీనంలో తీసుకున్ని తర్వాత మరింత అభివృద్ధి చెందినది.
గోల్కొండ గౌతమ్ కుమార్ పటేల్
ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్
పి.మహేందర్ గౌడ్ కార్యనిర్వహణాధికరి
