ప్రకటన న్యూస్ ప్రతినిధి, బి. అనిత : హైదరాబాద్, 20 జూలై, 2026
- రైతులు వరి పంటను నాటుకోకపోవడమే మంచిది
- కృషి విజ్ఞాన కేంద్రం మరియు వ్యవసాయ శాఖ బూర్గంపాడు హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి పంచాయతీ పరిధిలోని ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి వరి పొలం వద్ద సాగుచేసిన పచ్చిరొట్ట ఎరువులను కలియదున్నే కార్యక్రమనికి హాజరైన భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్ర బృందం మరియు బూర్గంపాడు వ్యవసాయ శాఖ అధికారులు ఎల్ నినో వాతావరణ పరిస్థితులు మరియు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువులను కలియ దున్నటం వల్ల సేంద్రీయ కర్బనం ఏర్పడి అధిక దిగుబడి రావడంతో పాటు తెగుళ్లు చీడపీడల నుండి పంటకు విముక్తి కలుగుతుందని అన్నారు. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదయినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా వరి ప్రతి మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు తెలిపారు.
రైతు సోదరులు వాతావరణ పరిస్థితులు గమనించి దీర్ఘకాలిక పంటలను సాగు చేయొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వరి నాటకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల్లో సైతం నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్యలు ఏర్పడతాయని ప్రత్యామ్నాయ పంటలు కంది, పెసర , బొబ్బర మొదలగు స్వల్పకాలిక పంటలు,వెదజల్లే పంటలను సాగు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బృందం భరత్, బూర్గంపాడు వ్యవసాయ శాఖ అధికారులు ఏడిఏ తాతారావు, ఏవో శంకర్, (ఏ ఈ ఓ లు ) పవన్, వైష్ణవి తో పాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
