బూర్గంపాడు,:: బూర్గంపాడు ఎస్సీ కాలనీ సమీపంలోని కిన్నెరసాని వాగులో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో టాస్క్ఫోర్స్ అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించి వాహనాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ, అక్రమ ఇసుక రవాణా మాత్రం యథావిధిగా కొనసాగుతోందని వారు చెబుతున్నారు.
తాజాగా ట్రాక్టర్లు కిన్నెరసాని వాగులోకి దిగి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. జేసీబీల సహాయంతో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, అక్రమ స్టాక్ పాయింట్లలో ఇసుకను నిల్వ చేసి అక్కడి నుంచి లారీలకు తరలిస్తూ వ్యాపారం సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దీంతో ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిల్లడమే కాకుండా, పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, మైనింగ్ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖ మరియు టాస్క్ఫోర్స్ అధికారులు తక్షణమే స్పందించి కిన్నెరసాని వాగులో తనిఖీలు నిర్వహించాలని, అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
